REVANTH: రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి **రేవంత్ రెడ్డి**కు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ హార్వర్డ్ యూనివర్సిటీలో నిర్వహించనున్న తొలి కృత్రిమ మేధ (AI) సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఈ సదస్సును హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహించనుండగా, భారత్ నుంచి ఒక్క రేవంత్ రెడ్డికే ఈ అవకాశం లభించడం విశేషంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పాలన, విధాన రూపకల్పన, సాంకేతిక మార్పులు, కృత్రిమ మేధ వినియోగంపై చర్చ జరగనున్న ఈ కీలక సదస్సుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడటం తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. పాలనలో నూతన ఆలోచనలు, ప్రజాకేంద్రిత విధానాలు, సాంకేతికతను వినియోగించి అభివృద్ధి సాధించాలన్న దృష్టికోణం కారణంగానే ఈ ఆహ్వానం అందిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీలో తన చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి విస్తృత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హార్వార్డ్లోని పలు పాఠశాలల విద్యార్థులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో పాటు, అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యంగా MIT, Columbia University వంటి విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో జరిగిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ సమావేశాల్లో నాయకత్వ లక్షణాలు, విజయాల సాధనకు అవసరమైన వ్యూహాలు, అభివృద్ధి నమూనాలు, ఆర్థిక పురోగతి, స్థిరమైన వృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై సీఎం తన అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ పథకాలు, మహిళలు–యువత సాధికారతకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ఉపాధి సృష్టి అంశాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. సాంకేతికతను మానవ సంక్షేమానికి ఎలా ఉపయోగించుకోవాలి, కృత్రిమ మేధ ద్వారా పాలనను మరింత పారదర్శకంగా ఎలా మార్చవచ్చన్న అంశాలపై సీఎం చేసిన ప్రసంగం విశేష స్పందన పొందినట్లు సమాచారం. అభివృద్ధి అనేది కేవలం ఆర్థిక గణాంకాలకే పరిమితం కాకుండా, పర్యావరణ సమతుల్యత, సామాజిక బాధ్యతలతో కూడి ఉండాలన్న దృష్టికోణాన్ని ఆయన స్పష్టంగా వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
