CBN: "ఏపీ విమానాశ్రయరంగంలో ఓ మైలురాయి"

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరే దిశగా మరో కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా వాలిడేషన్ విమానం ఉదయం 11 గంటల సమయంలో రన్వేపై సురక్షితంగా ల్యాండ్ కావడంతో, ఈ ప్రాజెక్టు మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే వాటర్ సెల్యూట్తో ఘనస్వాగతం పలికారు. ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ **కలిశెట్టి అప్పలనాయుడు**తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రయాణించారు. వారు విమానాశ్రయ ప్రాంగణాన్ని పరిశీలించి, అధికారులతో పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలిడేషన్ విమానం ల్యాండ్ కావడం ఏపీ విమానయాన రంగంలో సరికొత్త మైలురాయి అని ఆయన అభివర్ణించారు. 2014–19 ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడిందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు ఇది సాకారమవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, “ఎయిర్పోర్ట్ అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదు. అది ఆ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఇంధనంగా మారుతుంది” అని అన్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షితమవుతాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్చేంజర్గా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏపీ అభివృద్ధిలో భోగాపురం మైలురాయి: జగన్
విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం వైఎస్సార్సీపీ హయాంలోనే అనుమతులు సాధించడం, ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశామని జగన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
